ఉత్తరాంధ్ర మంత్రులకు తిరుగులేనట్లే..!

ఏపీలో అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు కథనాలు, సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో వారికి గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి. అలాగే వీరిలో కొందరు మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కానీ ఏ మంత్రి పరిస్తితి ఎలా ఉన్నా సరే ఉత్తరాంధ్రలోని మంత్రులకు తిరుగులేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులకు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో తేలింది.

ఉత్తరాంధ్రలో మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. విశాఖలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు..విజయనగరంలో బొత్స సత్యనారాయణ, రాజన్న దొర.. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఉన్నారు. వీరిలో ఒక్క అప్పలరాజుకు తప్ప మిగిలిన వారి గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్‌కు మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది.

కాకపోతే టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే అమర్నాథ్ గెలుపు కోసం కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అటు మాడుగులలో బూడి ముత్యాలనాయుడుకు మళ్ళీ తిరుగులేదని తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి కూడా డౌట్ లేదట. విజయనగరంకు వస్తే..చీపురుపల్లిలో బొత్సని నిలువరించడం జరిగే పని కాదు. పులివెందులలో జగన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో..చీపురుపల్లిలో బొత్స అంత స్ట్రాంగ్.

అటు సాలూరులో రాజన్న దొరకు ఎదురులేదు. మళ్ళీ డౌట్ లేకుండా గెలిచేలా ఉన్నారు. ఇక శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ జనసేనకు కాస్త ఓటింగ్ ఉంది. అంటే టీడీపీ-జనసేన కలిస్తే ధర్మానకు కాస్త రిస్క్. ఇక పలాసలో అప్పలరాజు పరిస్తితి మెరుగ్గా కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. అదే సమయంలో టీడీపీతో జనసేన కలిస్తే అప్పలరాజుకు గెలుపు డౌటే.