పవన్ గ్రాఫ్ పెంచుతున్న కేవీపీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవీపీ రామచంద్రరావు గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. వైఎస్సార్ సన్నిహితుడుగా మెలిగిన కేవీపీ..గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ అనే విధంగా రాజకీయం నడిచింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కేవీపీ..రాజకీయం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుంది. జగన్ వేరే పార్టీ పెట్టినా సరే…అటువైపుకు కేవీపీ వెళ్లలేదు. మరి పరోక్షంగా ఏమైనా సహకారం అందించారేమో గాని..ప్రత్యక్షంగా జగన్ వైపు చూడటం లేదు.

ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు..రెండు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఈయన రెండు రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిస్తితులపై విశ్లేషణలు కూడా ఇస్తున్నారు. పలు మీడియా చానల్స్ ఇంటర్వ్యూలో రాజకీయ పరిస్తితులని వివరిస్తున్నారు. ఇదే తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేవీపీ..ఏపీలోని రాజకీయ పరిస్తితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2012 ఉపఎన్నికల్లో గెలిచిన వైసీపీ..2014లో ఓడిపోయిందని, ఇక అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిందని, కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చెప్పుకొచ్చారు.

అలాగే పవన్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్‌పై విమర్శలు చేసిన కేవీపీ..ఇప్పుడు పవన్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి దెబ్బకు పవన్ మళ్ళీ రాజకీయాలు చేయరని అంతా అనుకున్నారని, కానీ పవన్ గోడకు కొట్టిన బంతి మాదిరిగా నిలదొక్కుకుని రాజకీయాలు చేస్తున్నారని, అలాగే ప్రజా సమస్యలపై పోరాట చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

2019తో పోలిస్తే ఇప్పుడు పవన్ గ్రాఫ్ పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన కీలకమవుతారనే విధంగా మాట్లాడారు. చంద్రబాబు గ్రాఫ్ పెరగలేదని, కానీ బాబుతో పవన్ కలిస్తే అడ్వాంటేజ్ ఉంటుందనే విధంగా మాట్లాడారు. మొత్తానికి పవన్ గ్రాఫ్ పెరుగుతుందని కేవీపీ చెప్పుకొచ్చారు. కేవీపీ వ్యాఖ్యలు జనసేనకు ఊపునిచ్చేలా ఉన్నాయి. మరి ఇందులో కేవీపీ రాజకీయం కోణం ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఉంది.