కేశినేని లాజిక్ కరెక్టే..తొడగొడితే నో యూజ్..!

టీడీపీ ఎంపీ కేశినేని నాని..స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా రాజకీయం చేస్తున్న నాయకుడు. ప్రత్యర్ధులు చేసే తప్పులని ఎత్తిచూపి..వారిపై విరుచుకుపడటమే కాదు..సొంత పార్టీలో కూడా తప్పులు జరిగితే వాటిని ధైర్యంగా ఎత్తిచూపుతారు. అలాగే విమర్శలు కూడా చేస్తారు. గత ఎన్నికల నుంచి టీడీపీలో జరిగే తప్పిదాల గురించి కేశినేని గళం విప్పుతూనే ఉన్నారు. అలాగే భజన చేసే నేతల మాటలు వినే చంద్రబాబుపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి వారిపై నేరుగానే విమర్శలు చేశారు. అలాగే దేవినేని ఉమా టార్గెట్‌గా కూడా కేశినేని ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా సొంత పార్టీ నేతలనే కేశినేని టార్గెట్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అలాగే కొందరు టీడీపీ నేతలు కేశినేని తీరుపై మండిపడ్డారు. అలాగే ఆయన పార్టీ మారిపోతారని, అందుకే ఇలా సొంత పార్టీ వాళ్లపై విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. చివరికి తాను పార్టీ మారిపోతానని ప్రచారం మీద పెట్టే శ్రద్ధ..పార్టీని బలోపేతంపై పెట్టాలని కూడా కౌంటర్ ఇచ్చారు.

తాజాగా విజయవాడ వెస్ట్ ఇంచార్జ్‌గా ఉన్న కేశినేని..అక్కడ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని నిర్వహించారు. ఈ సందర్భంగా.. మీడియా నుంచి నాయకులు పుట్టలేరని, ప్రజల నుంచి నాయకులు బయటకు వస్తారని, పార్టీకోసం నిస్వార్థంగా పనిచేసేవారికి ప్రాధాన్యం ఉంటుందని, కమర్సియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎక్కడో తొడలు కొట్టి, మీసాలు తిప్పడం వల్ల ప్రయోజనం లేదని..పరోక్షంగా దేవినేనికి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల దేవినేని..కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో..నెక్స్ట్ గుడివాడలో కొడాలిని ఓడిస్తామని తొడగొట్టి చెప్పారు. అలాగే రావి వెంకటేశ్వరరావు చేత తొడగొట్టించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేశినేని..ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కొడాలిని ఓడించాలంటే తొడలు గొడితే సరిపోదు..ఆయనకు ఓడించడానికి పక్కా స్కెచ్ వేయాలి తప్ప..ఇలా తొడగొడితే ఉపయోగం ఉండదు.