పర్చూరు ఫిక్స్.. దగ్గుబాటి కోసం చీరాల..?

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే చంద్రబాబు..అప్పుడే అసెంబ్లీల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. అలాగే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తానని తేల్చి చెప్పేశారు. దీంతో సిట్టింగులకు సీట్లు ఫిక్స్ అయిపోయాయి.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో బాలవీరాంజనేయస్వామి పోటీ చేయనున్నారు. అలాగే జిల్లాలో పలువురు ఇంచార్జ్‌లకు కూడా దాదాపు సీట్లు ఫిక్స్ అయ్యాయి. కానీ నాలుగు సీట్లలో ఇంకా అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేదు. దర్శి, చీరాల, కందుకూరు, యర్రగొండపాలెం సీట్ల విషయంలో స్పష్టత రావడం లేదు. చీరాల మినహా మిగిలిన సీట్లలో టీడీపీలో బాగా పోటీ ఉంది. ఆ సీట్లు ఎవరికి దక్కుతాయో క్లారిటీ లేదు.

అయితే చీరాలలో మాత్రం..ప్రస్తుతానికి ఎం‌ఎం కొండయ్య ఇంచార్జ్‌గా ఉన్నారు. కానీ ఈయన అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే క్రమంలో ఈ సీటుని..దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడు హితేష్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ పెద్దల్లుడు అయిన దగ్గుబాటి..గతంలో టీడీపీలో, ఆ తర్వాత కాంగ్రెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్ళగా, దగ్గుబాటి రాజకీయాలకు దూరమయ్యారు.

కానీ 2019 ఎన్నికల్లో తన తనయుడుని వైసీపీలో చేర్చారు. కాకపోతే హితేష్ విదేశీ పౌరసత్వం ముగియకపోవడంతో దగ్గుబాటి వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఈ మధ్య దగ్గుబాటి..చంద్రబాబుకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే హితేష్‌ని టీడీపీలోకి తీసుకొచ్చి..చీరాల సీటు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఎలాగో పర్చూరు సీటు ఫిక్స్ అయింది. దీంతో చీరాల సీటు ఇస్తారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాలి.