ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 5 గురు టాప్‌ డైరెక్ట‌ర్లను లైన్లో పెట్టిన మ‌హేష్‌… వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లే..!

ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 5 దర్శకులను లైన్‌లో పెట్టాడు. వారందరూ కూడా స్టార్ డైరెక్టర్లు కావడం విశేషం. ఈ ఇంట్రెస్టింగ్ లైనప్ చూసి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఏ డైరెక్టర్లతో మహేష్ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మహేష్ బాబు సినిమా తీసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో వీరి కాంబో మూడోసారి రిపీట్ అవుతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే మహేష్ తో జత కట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.

దిగ్గజ దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు ఒక సినిమా ప్రకటించిన సంగతి విదితమే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో కలిసి ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా ఎంత బాగుంటుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటివరకు మహేష్ రాజమౌళితో కలిసి సినిమా తీయలేదు. అయితే ఎట్టకేలకు అభిమానుల కల నెరవేర్చుతూ వీరిద్దరూ ఒక మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. రంగస్థలం పుష్ప సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో మూవీ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు మహేష్. రాజమౌళితో సినిమా షూటింగ్ పూర్తి చేశాక సుక్కుతో మహేష్ సినిమా ప్రారంభించనున్నాడని సమాచారం.

ఈ చిత్రం పూర్తయ్యాక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో ఒక డిఫరెంట్ మూవీ చేయాలని మహేష్ ప్లాన్ చేశాడు. పోకిరి, బిజినెస్‌మ్యాన్ సినిమాలు మహేష్, పూరి జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే ఈ మాస్ డైరెక్టర్‌తో మరో మూవీ తీయడానికి కూడా మహేష్ ఒప్పుకున్నాడు. ఇలా ఐదు డైరెక్టర్లను మహేష్ లైనప్ చేసి ఆశ్చర్య పరుస్తున్నాడు.