ఉదయ్ కిరణ్ హిట్లు.. ప్లాపులు… క‌లెక్ష‌న్లు…!

ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జెనరేషన్స్ మారుతున్నా ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు పరిశ్రమకు వచ్చి, ఎదిగిన హీరోలలో ఉదయ్ ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఆనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉద‌య్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇతని మొదటి సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘చిత్రం.’ డైరెక్టర్ తేజ తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది.

తెలుగు యువత గుండెను హత్తుకున్న ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఉదయ్ కిర‌ణ్ వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నాడు. ఈ సినిమా ఆ రోజుల్లోనే 35ల‌క్ష‌ల క‌లెక్ష‌న్ లు రాబ‌ట్టి ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఈ క్రమంలో మ‌రోసారి తేజ ఉద‌య్ కిర‌ణ్ కాంబోలో ‘నువ్వునేను’ అనే సినిమా తీయగా 65ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో ఉదయ్ స్టార్ అయిపోయాడు.

ముఖ్యంగా అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. 2001లో వ‌చ్చిన మ‌రో ప్రేమకథ సినిమా ‘మ‌న‌సంతా నువ్వే’ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు VN ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఏకంగా కోటిన్న‌ర‌కు పైగానే వ‌సూలు చేయడంతో అందరి చూపులు ఉదయ్ కిరణ్ పైనే పడ్డాయి. ఆ త‌ర‌వాత ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ కాస్త నెమ్మదించిందనే చెప్పుకోవాలి. మ‌రోసారి ఉద‌య్ కిర‌ణ్ విఎన్ ఆదిత్య కాంబినేష‌న్ లో వచ్చిన ‘శ్రీరామ్’ అనే సినిమా ప్లాప్ గా నిలించింది. అయిన‌ప్ప‌టికీ 65ల‌క్ష‌లు వ‌సూలు చేసి, సేఫ్ జోన్లో నిలిచింది.

దీని తరువాత ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన ‘నీస్నేహం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచి, రూ.65ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన ‘హోలీ’ సినిమా ఫ్లాప్ కాగా 45ల‌క్ష‌లు మాత్రమే వ‌సూలు చేసింది. తరువాత 2003లో వచ్చిన ‘జోడీ’ అనే సినిమా కూడా ఫ్లాప్ అయ్యి, 35ల‌క్ష‌లతో సరిపెట్టుకుంది. ఇక వీటి తరువాత వచ్చినవి కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. చివరగా ఉద‌య్ న‌టించిన ‘చిత్రం చెప్పిన క‌థ’ విడుద‌ల‌వ‌కుండానే పోయింది.