పెళ్లైన ఆమెకు ఇద్ద‌రు ఫేస్‌బుక్ ల‌వ‌ర్స్‌… హైద‌రాబాద్‌లో అదిరిపోయే ట్విస్ట్‌…!

రోజు రోజుకు స‌మాజంలో బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియా యుగంలో క్ష‌ణికావేశానికి లోన‌య్యి ముక్కు మొఖం తెలియ‌ని వారి చేతిలో మోస‌పోతూ స‌ర్వ‌స్వం అర్పించేసుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌గ‌రం నడిబొడ్డున ఈ నెల 4న మీర్ పేటలోని నంది హిల్స్ లో అర్థరాత్రి వేళ చౌరస్తాలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి… తర్వాత మరణించాడు. ముందు ఇది రోడ్డు ప్ర‌మాదం అనే అంద‌రూ అనుకున్నారు. త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో అత‌డి సెల్‌ఫోన్ దొర‌క‌డంతో అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఐటీ జాబ్ చేస్తున్న విక్రమ్ రెడ్డి.. శ్వేతారెడ్డి దంపతులు. వీరిది షాద్‌న‌గ‌ర్‌. అయితే వీరు ప్ర‌శాంతి హిల్స్‌లో ఉంటున్నారు. 2018లో శ్వేత‌కు య‌శ్మ‌కుమార్ ప‌రిచ‌యం అవ్వ‌డం.. అది కాస్తా ప్రేమ‌గా మార‌డంతో వీరి మ‌ధ్య సీక్రెట్‌గా వివాహేత‌ర సంబంధం న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్వేత‌కు ఫేస్‌బుక్ ద్వారా ఏపీలోని తిరువూరుకు చెందిన 28 ఏళ్ల అశోక్ కూడా ప‌రిచ‌యం అయ్యాడు. అత‌డితో కూడా శ్వేత ప్రేమాయ‌ణం సాగిస్తోంది. ఇత‌డు ప్రైవేటు కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌.

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న శ్వేతతో గతంలో యశ్మ కుమార్ న్యూడ్ కాల్స్ చేయించుకుని వాటిని రికార్డు చేసుకున్నాడు. ఇప్పుడు వాటిని చూపిస్తూ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయ‌డంతో ఆమె య‌శ్మ‌కుమార్‌ను చంపాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే అశోక్‌కు చెప్ప‌డంతో అశోక్ త‌న మిత్రుడు కార్తీక్‌తో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత శ్వేత‌తో య‌శ్మ‌కుమార్‌కు ఫోన్ చేయించి.. నందిహిల్స్‌కు ర‌ప్పించారు.

శ్వేత అక్క‌డ‌కు చేరుకునేలోగానే అశోక్ – కార్తీక్ ఇద్ద‌రూ య‌శ్మ‌కుమార్ త‌ల‌పై కొట్ట‌డంతో తీవ్ర గాయాల‌తో కింద ప‌డిపోయాడు. అయితే అత‌డి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ప‌క్క‌కు ప‌డిపోయింది. అటు వాహ‌నాలు వ‌స్తుండ‌డంతో వాళ్లు పారిపోయారు. పోలీసులు ముందు దీనిని రోడ్డు ప్ర‌మాదంగా భావించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో అత‌డి మొబైల్ గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ ఓపెన్ చేయ‌డంతో శ్వేతారెడ్డి గుట్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. చివ‌ర‌కు శ్వేత‌తో పాటు అశోక్‌, కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.