స‌ర్కారు వారి పాట‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ప్రేమ ఎంతంటే … !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండేళ్ల‌కు పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌హేష్ బాబు న‌టించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా గీత‌గోవిందం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత పెట్ల ప‌ర‌శురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా మ‌రో ఐదు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ గ్లింప్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. అంతేకాకుండా ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా నిలిచిపోయేదిలా కనిపిస్తుంది. ఇక భారీ బ‌డ్జెట్ కావ‌డంతో పాటు, వ‌డ్డీ రేట్లు పెరిగిపోవ‌డంతో స‌ర్కారు వారి పాట‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని రోజులు స్వల్పంగా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చాయి.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం కూడా హై బడ్జెట్ క్యాటగిరీ లో 10 రోజుల పాటు 45 రూపాయలు అదనంగా పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ఇది స‌ర్కారు వారి పాట‌పై జ‌గ‌న్ స‌ర్కార్ చూపించిన ప్రేమ‌గానే చెప్పాలి.

సినిమాకు టాక్ వ‌స్తే చాలు భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.