రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. ఆ ఎమ్మెల్యే సీటు ఖ‌రారైందా…?

ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన కడప నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఇక జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. జగన్ తల్లి విజయమ్మ సైతం 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక జగన్ సోదరి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే గా ఉన్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా కొనసాగుతున్నారు. జగన్ బంధువుల్లో చాలా మంది కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు జగన్ బావమరిది సైతం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ బావమరిది అంటే ఎవరో కాదు జగన్ కు స్వయానా మేన‌మామ అయిన కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేన్ రామానుజుల రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి గతంలో కడప జడ్పీ చైర్మన్ గా.. ఆ తర్వాత కడప మేయర్‌గా పనిచేశారు.

జగన్ వైసిపి ప్రారంభించిన వెంటనే ఆ పార్టీలోకి వచ్చిన రవీంద్రనాథ్రెడ్డి 2014 – 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కమలాపురం ఎమ్మెల్యే గా గెలిచారు. ఆయ‌న‌ కావాలనుకుంటే 2024 ఎన్నికల్లోనూ ఆయన కమలాపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. అయితే ఇప్పటికే జడ్పీ చైర్మన్‌గా, మేయ‌ర్‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్రనాథ్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన తనయుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే రామానుజుల రెడ్డి చింతకొమ్మదిన్నె జడ్పిటిసి గా ఏకగ్రీవంగా గెలిచారు.

నియోజకవర్గంలో చాలా చురుకుగా పర్యటిస్తున్నారు. తండ్రి వ్యవహారాలు అన్నీ ఆయన చాటుమాటుగా చ‌క్క పెడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న వారు వచ్చే ఎన్నికల్లో త‌న‌యుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి తప్పుకుని… తన తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటే జగన్‌ కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు. ఏదేమైనా జగన్ ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది.