దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఇండియా అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఇద్దరు క్రేజీ స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా కావటంతో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి.
ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఓవైపు నందమూరి – మెగా ఫ్యామిలీ అభిమానుల సందడి కూడా స్టార్ట్ అయింది. రామ్ చరణ్ సరసన ఆలియాభట్, ఎన్.టి.ఆర్ కి జోడీగా ఒవీలియో మోరిస్ నటిస్తున్నారు. సముద్రఖని – శ్రీయ – అజయ్ దేవగన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితోపాటు పలువురు బ్రిటిష్ నటీనటులు ఈ సినిమాతో మెప్పించనున్నారు. గత సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికి ముందే ఈ సినిమా కోసం ఏకంగా రు. 20 కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. త్రిబుల్ ఆర్ సినిమా తెలుగు – తమిళ – మలయాళ – కన్నడ – హిందీ పాటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద తెరగా పేరొందిన బ్రిటన్లోని బిఎఫ్ మల్టీఫ్లెక్స్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. యూకేలో మొత్తం 1000 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు ఏమాత్రం మంచి హిట్ టాక్ వచ్చిన వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ దగ్గర వీరంగం ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.