ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు రాజ్యసభ పదవుల లొల్లి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. దీంతో త్వరలోనే ఈ 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికితోడు టిడిపి – జనసేన నుంచి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వైసిపికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మొత్తం వైసిపికి ఏకంగా 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు క్లారిటీ వస్తుంది.
ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోకే పడనున్నాయి. అయితే ఈ పదవుల కోసం వైసీపీలో ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచి జగన్ ఎన్నో పదవులు ఇస్తామని హామీ పొందిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరిని జగన్ ఇప్పటికీ పట్టించుకోలేదు. దీంతో వీళ్లంతా తీవ్రమైన అసహనంతో ఊగిపోతున్నారు. ఈసారి ఎలాగైనా లాబీయింగ్ చేసి రాజ్యసభ సీటు దక్కించుకోవాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరిలో టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. అయితే రెడ్డి వర్గానికి విజయసాయికి మరో సారి పదవి రెన్యువల్ కావడం ఖాయం. దీంతో మరో రెడ్డికి రాజ్యసభ ఇస్తారా ? అన్నది డౌటే ? వైవికి రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయనకు ఆ ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక సజ్జలను తన దగ్గరే ఉంచుకుంటారని.. ఆయనకు కూడా రాజ్యసభ ఇవ్వరని టాక్ ?
ఇక మైనార్టీ కోటాలో సినీ నటుడు ఆలీ పేరు వినిపిస్తోంది. ఇక పారిశ్రామికవేత్తల కోటాలో ఆదానీ భార్యకు సీటు కన్ఫార్మ్ అంటున్నారు. జగన్ పార్టీ కోసం నమ్ముకున్న వాళ్లను కాదని.. ప్రతిసారి పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు ఇస్తుండడం పార్టీ వర్గాలకు రుచించడం లేదు. ఇక బీసీ మహిళా కోటాలో కిల్లి కృపారాణి పేరు కూడా వినిపిస్తోంది. ఇక మంత్రి పదవి హామీ పొంది ఉన్న కమ్మ నేత మర్రి రాజశేఖర్ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. మరి జగన్ లెక్కలు ఎలా ఉన్నాయో ? చూడాలి.