రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి ప్రధాన సమస్య వచ్చిపడింది. ఎందుకం టే.. నిన్న మొన్నటి వరకు టీడీపీని, వైసీపీని కుటుంబ పార్టీలుగా చెప్పుకొంటూ.. వచ్చి ప్రజల్లో మేలు పొందాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ మాట్లాడినా.. పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఇదే విషయం చెబుతున్నారు. తమది పవిత్రమైన పార్టీ అని.. తమ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కట్టుబడిన పార్టీ అని చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు బాగానేఉన్నా.. కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఇప్పుడు వెలుగు చూసిన ఒక విషయానికి మధ్య బీజేపీ నలిగిపోతొంది.
తాజాగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సీబీఐ అధికారులకు గత ఏడాది ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. దీనిలో ఆమె ఒక సంచలన విషయాన్ని చెప్పారు. ఈ కేసులో ఆరోపణ లు ఎదుర్కొంటున్నవారు.. సీబీఐ విచారణ కనుక మొదలు పెడితే.. బీజేపీలోకి వెళ్లిపోతారని.. అనుమానం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎంత వరకు వాస్తవం అనేది పక్కన పెడితే.. జాతీయ రాజకీయాల్లోనూ.. పొరుగున ఉన్న తెలంగాణలోనూ.. ఏపీలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఇది నిజమేనేమో.. అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయకులకు బీజేపీ పునరావాస కేంద్రంగా మారిపోయిం ది. తెలంగాణలో చూసినా.. ఏపీలో చూసినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బీజేపీలో చేరిపోతున్నారు. వాస్తవానికి తమ పార్టీకి మకిలి అంటదని పదే పదే చెప్పే బీజేపీ నేతలు.. వీరిని ఎందుకు చేర్చుకుంటున్నారనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు.. వారికి పదవులు కూడా ఇస్తున్నారు. దీంతో సోము వీర్రాజు చుట్టూ.. ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడిందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ఆయన చెబుతున్నట్టుగా.. కుటుంబ పార్టీలు ఉన్నా నష్టం లేదని.. ఇలాంటి అవకాశ వాదులను పార్టీలో చేర్చుకునే బీజేపీతోనే నష్టమని.. పరిశీలకులు చెబుతున్నారు. దీంతో దీనిని ఖండించలేక, సమర్ధించలేక సోము తర్జన భర్జన పడుతున్నారు. మరి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.