తాజాగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ మధ్య కొంత కాలంగా ఉన్న గ్యాప్ను ఫిల్ చేసేందుకు ఇండస్ట్రీ టాప్ హీరోలు, టాప్ దర్శకులు వెళ్లి ఏపీ సీఎం జగన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి కొద్ది నెలల ముందు నుంచే పలువురు సినీ ప్రముఖులు జగన్ను కలుస్తూ వచ్చారు. అంతకుముందు సురేష్బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు ఓ సారి వెళ్లి జగన్ను కలిసి వచ్చారు. తర్వాత కొద్ది రోజుల క్రితమే చిరంజీవి ఒక్కరే వెళ్లి జగన్ను కలిసి లంచ్ చేసి వచ్చారు. అయితే అది కేవలం పర్సనల్ భేటీ అని.. ఇండస్ట్రీకి, ఆ భేటీకి సంబంధం లేదన్న టాక్ బయటకు వచ్చింది.
ఇక మూడు రోజుల క్రితం జరిగిన భేటీలో టాప్ హీరోలు, దర్శకులు అందరూ పాల్గొన్నారు. ఈ మీటింగ్ కి చిరు, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని తదితరులు కలిసి ముఖ్యమంత్రితో సమావేశం కావడంతో పాటు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ భేటీలో చిరంజీవి జగన్ను మరి బతిమిలాడుకోవడం చాలా మందికి నచ్చలేదు.
సరే ఇదిలా ఉంటే ఈ భేటీకి రావాల్సిందిగా చిరు బాలయ్యకు కూడా ఆహ్వానం పంపారట. అయితే బాలయ్య చిరు ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్యకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం, ఏపీ సీఎంవో వర్గాలు నిర్వహించిన ఈ భేటీలో టాప్ హీరోగాను, ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యకు ఎందుకు ఆహ్వానం లేదో ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.
ఇక ప్రభుత్వం నుంచి నేరుగా తనకు ఆహ్వానం లేకపోవడంతో పాటు తాను ఏపీలోనే ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ భేటీకి వెళ్లేందుకు బాలయ్యకు ఇష్టంలేకే రిజెక్ట్ చేశారని అంటున్నారు. ఇక ఈ భేటీకి జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున కూడా డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.