రెండు కాళ్ల మధ్య ఇరుక్కున్న స్కూటరిస్ట్.. స్వయంగా ఆస్పత్రికి తరలించిన పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కారు ర్యాలీలో రెండు కార్ల మధ్య ఇరుక్కుని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా స్వయంగా పవన్ కళ్యాణ్ అతడిని ఆస్పత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు.

పవన్ పర్యటనలో భాగంగా పామర్రు మండలంలోని కనుమూరు దగ్గర పార్టీ శ్రేణులు కారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని కొన్ని కార్లు అనుసరిస్తుండగా ప్రమాదవశాత్తు రెండు కార్ల మధ్య ఒక బైకు ఇరుక్కుపోయింది.ఈ ప్రమాదంలో ఒక జనసేన కార్యకర్త కాలు విరిగిపోయింది. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే కారు దిగి గాయపడ్డ వ్యక్తిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అతడిని వైద్యశాలలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కాగా పవన్ కళ్యాణ్ నేటి నుంచి శుక్రవారం వరకూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లా కు చేరుకుంటారు. అనంతరం భట్టిప్రోలు చావలి పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు.