తెలుగుదేశంలో యాత్రాకాలం.. టార్గెట్ 2023 అంటున్న తెలుగు తమ్ముళ్లు..

గత ఎన్నికలు ముగిసి వైసీపీ గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాల పాటు కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ నాయకులు కూడా ఎవరికి వారు అన్న చందంగా ఉన్నారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్లారు. టీడీపీలో రాజకీయంగా ఇంతకుమించి పెద్ద మార్పులేమీ చోటుచేసకోలేదు. అయితే 2023 సమీపించేకొద్దీ టీడీపీలో అధికారం కోసం ఆరాటం ఎక్కవైంది. అందుకే టార్గెట్ 2023 అన్నట్లు కార్యక్రమాలు రూపొందిస్తోంది. లోకేష్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ కావడం టీడీపీని ఇపుడు సంతోషపెడుతున్న విషయం. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఇపుడు యాత్రలకు శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తోందని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఏపీలో యాత్రలకు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కరే కాకుండా ఇద్దరు అగ్ర నాయకులు ప్రజల్లో ఉంటే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం వస్తుందనేది వారి ఆలోచన. అందుకే రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ టూర్ వేయాలని ప్లాన్ వేశారు.

తండ్రి బస్సుయాత్ర.. కుమారుడు సైకిల్ యాత్ర

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన చంద్రబాబు ఈసారి బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారట. వయసు మీద పడుతుంటం, పాదయాత్రకు ఆరోగ్యం సహకరించకపెవడంతో బస్సు యాత్ర చేయాలని వైద్య నిపుణులు సూచించారని సమాచారం. ఈ వయసులో పాదయాత్ర చేసి రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో యూత్ ఐకాన్ గా భావిస్తున్న నారా లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు సమాచార. పాదయాత్ర కాకుండా సైకిల్ యాత్ర చేపడితే పార్టీ గుర్తును ప్రమోట్ చేసినట్లు ఉంటుందని పార్టీలో తలపండిన సీనియర్లు సలహా ఇచ్చారు. మరి యాత్రలు ఎప్పుడు మొదలవుతాయో, ఎక్కడెక్కడ చేస్తారో అనే రూట్ మ్యాప్ బయటకు వస్తే తప్ప వీటి గురించి క్లారిటీ రాదు.