దేశంలో భారీగా ప‌డిపోయిన‌ క‌రోనా మ‌ర‌ణాలు..పెరిగిన కొత్త కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం భారీగా త‌గ్గాయి.

గ‌త 24 గంటల్లో భారత్‌లో 38,792 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074 కు చేరుకుంది. అలాగే నిన్న 624 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,11,408 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 41,000 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,01,04,720 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,29,946 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.