కరోనాతో భారతక్క మృతి..!

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరి భూషణ్ ఎలా చనిపోయాడన్న విషయంపై కొనసాగుతున్న సస్పెన్స్ తొలిగిపోయింది. మావోయిస్టు నేత హరి భూషణ్ కరోనా కారణంగా మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క అలియాస్ భారతక్క కూడా కరోనా కారణంగా మృతి చెందినట్లు సమాచారం.

ఈ నెల 21న మావోయిస్టు నేత హరి భూషణ్, 22న మరో మావోయిస్టు భారతక్క కరోనా కారణంగా మృతి చెందినట్లు వారు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. కరోనా రక్కసికి బలైపోయిన మావోయిస్టు నేతల అంత్యక్రియలు ప్రజల సమక్షంలోనే పూర్తి చేసినట్లు… మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి… దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులను కూడా వదలకపోవడం గమనార్హం. ఇద్దరు అగ్రనేతల మరణాలు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.