దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డించగా..మరోవైపు బీజేపీ నేతలు కూడా ఆమెను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. అందుకే ఈ రెండు పార్టీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. దీంతో అందరి దృష్టి బెంగాల్పేనే పడింది.