టీడీపీ కంచుకోట‌లో ఎన్ని కుమ్ములాట‌లో

ఏపీ అధికార పార్టీ టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంత‌పురం జిల్లాలో స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల కోసం కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి. 2014లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచిన వారు ఒప్పందం మేర‌కు రెండున్న‌రేళ్ల‌లో వేరేవారికి ప‌దవులు అప్ప‌గించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ద‌వీ వ్యామోహంతో ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చుతున్నారు. దీంతో జిల్లా అంత‌టా వివాదాలుగా మారింది.  జిల్లాలో పలు ఎంపీపీ, మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల మార్పు విషయంలో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయంలో రెండున్నరేళ్ల పదవి ఒప్పందం కుదుర్చుకున్న నేతలు ప్రస్తుతం ఆ సమయం గడిచిపో వడంతో వేరే వారికి అప్ప‌గించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. అలా చేయ‌కుండా పంచాయ‌తీలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు పదవిలో ఉన్నవారు ఇంకా కొనసాగాలని చూస్తుండగా, రెండున్నరేళ్లుగా ఆ పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్లు తమ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ పదవి జనవరి 5 నాటికి రెండున్నరేళ్లు ముగిసింది. దీంతో ముందుగా ఒప్పందం చేసుకున్నట్లు గుమ్మఘట్ట జడ్పీటీసీ పూల నాగరాజుకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఇదే అంశాన్ని జిల్లాలో పలువురు ముఖ్య నేతలు పట్టుబడుతున్నారు. పుట్టపర్తి మున్సిపల్‌ ఛైర్మన్‌గా పీసీ గంగన్న కొనసాగుతుండగా, రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవిని చలపతికి ఇస్తామని తొలుత ఒప్పందం జరిగింది. ఇప్పుడు రెండున్నరేళ్లు సమయం ముగియడంతో చలపతి ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు.

అదేవిధంగా కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌ వైపీ రమేష్‌, వైస్‌ ఛైర్మన్‌గా ప్రస్తుతం మహబూబ్‌బాషా కొనసాగుతుండగా వీరి ఒప్పందం ముగియడంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానంలో టీడీపీ సీనియర్ నేత‌ గోవిందప్ప సతీమణి బిక్కి రామలక్ష్మమ్మ, వైస్‌ ఛైర్మన్‌ స్థానంలో శ్రీనివాసరెడ్డికి ఒప్పందం ప్రకారం బాధ్యతలు ఇవ్వాల్సి ఉండగా, దీనిపైనా సందిగ్ధం నెలకొంది. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. రాయదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌గా వీఎం రాజశేఖర్‌ కొనసాగుతుండగా ప్రస్తుతం ఆయన ఒప్పందం ముగియడంతో తమకు అవకాశం ఇవ్వాలని ఇద్దరు కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు.

కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం మ‌రియాభాను కొనసాగుతుండగా రెండున్నరేళ్ల తర్వాత వేరొకరికి అవకాశం ఇవ్వాలని తొలుత భావించారు. అయితే వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరడంతో ఆయన అనుయాయులైన కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి వచ్చారు. తాజాగా భాను స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చినపుడు ఏమైనా తేడా వస్తే ఎమ్మెల్యే వర్గానికి చెందినవారు ఆ పదవిని పట్టేసే అవకాశం ఉందనే భావిస్తున్నారు.

మడకశిర మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి విషయంలో ప్రస్తుత ఛైర్మన్‌ ప్రకాశ్‌ పదవీ కాలం రెండున్నరేళ్లు పూర్తికాగా, శరణ్యకు అవకాశం దక్కాల్సి ఉంది. వీరిలో చెరొకరికి ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి మద్దతు ఉంది. దీంతో ఈ పదవిమార్పుపై ఆసక్తి నెలకొంది.  ఇలా అన్ని స్థానిక సంస్థ‌ల్లోనూ నేత‌ల మార్పు పెద్ద ఎత్తున వివాదాల‌కు దారితీస్తోంది. సీమ‌లో టీడీపీ ఎంతో బ‌లంగా ఉన్న అనంతలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం అధిష్టానాన్ని సైతం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.