మరొకసారి గన్నవరం రాజకీయాల్లో కీలక ట్విస్ట్ వచ్చింది. అనూహ్యంగా గన్నవరం టిడిపి ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు మరణించడంతో..కొత్త ఇంచార్జ్ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన అర్జునుడు కోమాలోకి వెళ్ళి..గురువారం మరణించారు. ఇక అర్జునుడు మరణంతో గన్నవరంలో మళ్ళీ టిడిపి అభ్యర్ధిని వెతుక్కునే పనిలో ఉంది. ఇక్కడ వరుసగా టిడిపి అభ్యర్ధులని మార్చాల్సిన పరిస్తితి వచ్చింది. 2009లో గన్నవరంలో టిడిపి నుంచి దాసరి బాలవర్ధనరావు గెలిచారు.
కానీ 2014లో ఆయనకు సీటు ఇవ్వలేదు. గతంలో వల్లభనేని వంశీకి మాట ఇవ్వడంతో..2014లో ఆయనకు సీటు ఇచ్చారు. దీంతో వంశీ టిడిపి తరుపున 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో గెలిచాక ఆయన టిడిపిని వదిలి వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో కొన్ని రోజులు టిడిపికి నాయకుడు లేరు. ఆ తర్వాత బచ్చుల అర్జునుడుని టిడిపి ఇంచార్జ్గా పెట్టారు. ఆయన కొంతమేర పనిచేశారు. ఇప్పుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో గన్నవరంలో కొత్తగా టిడిపి అభ్యర్ధిని వెతకాల్సి ఉంది.
ఇటీవల వంశీ అనుచరుల దాడుల వల్ల కొనకళ్ళ నారాయణని కో ఆర్డినేటర్ గా పెట్టారు. అయితే ఆయన తాత్కాలికమే అని చెప్పాలి. అయితే గన్నవరం సీటుని కమ్మ వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వస్తుంది. గద్దె రామ్మోహన్ ని గన్నవరంకు పంపిస్తారనే టాక్ ఉంది. కానీ ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయన భార్య గద్దె అనురాధాని పంపిస్తారా? లేక దేవినేని చందు సైతం గన్నవరంలో పోటీ చేస్తానని అంటున్నారు..ఇటు పట్టాభి సైతం గన్నవరంలో పోటీ చేయాలని చూస్తున్నారు.
మొన్న గొడవలు జరిగినప్పుడు పట్టాభి వచ్చి టిడిపి శ్రేణులకు అండగా నిలిచి జైలు పాలయ్యారు. ఇప్పుడు ఆయన జైల్లోనే ఉన్నారు. మరి చూడాలి గన్నవరంలో టిడిపి నుంచి ఎవరు పోటీ చేస్తారో.