“ప్రాజెక్ట్ కే ” సెట్లో గాయపడిన అమితాబ్ బచ్చన్..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే.. ఇందులో ప్రభాస్ హీరోగా , దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఒక సన్నివేశంపై చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పక్కటెముకలకు గాయమైందట. అమితాబ్ బచ్చన్ తో పాటు మరికొంతమంది యూనిట్ సభ్యులు కూడా గాయపడ్డారని సమాచారం.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ముంబై తిరిగి వెళ్ళిపోయి ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా మిగతా వారికి చికిత్స అందిస్తున్నారు అని సమాచారం. కొద్ది రోజుల క్రితం సొంతంగా బ్లాగ్ క్రియేట్ చేసిన అమితాబ్ తన జీవితంలో జరిగిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రాజెక్ట్ కే సినిమా చిత్రీకరణ సెట్ లో ప్రమాదానికి గురైనట్టుగా కూడా స్పష్టం చేశారు. ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని తనకు గాయాలు కూడా అయ్యాయి అని తెలిపారు..

ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో ప్రాజెక్టు కే షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. వెంటనే ఏఐజి హాస్పిటల్ లో డాక్టర్లను సంప్రదించగా.. నాకు సిటీ స్కాన్ చేశారు.. మిగతా వారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం నేను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను.. నా గాయం కాస్త నొప్పిగానే ఉంది.. కదలడానికి ,ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది..కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ గాయం కారణంగా నేను చేయాల్సిన పనులన్నీ ఆగిపోయాయి. చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ముఖ్యమైన పనులకు ఫోన్ ద్వారా అటెండ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు అమితాబ్.