వైసీపీకి ఒక్క ధర్మాన చాలు..!

అవును వైసీపీని దెబ్బకొట్టడానికి ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు చాలు అని ఆ పార్టీలోనే చర్చ జరిగే పరిస్తితి కనిపిస్తోంది. ఆయన వైసీపీని లేపుతున్నారో లేక..వైసీపీని కింద పడేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది..మంచి వాక్చాతుర్యం కలిగిన ధర్మాన..రాజధానిపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎప్పటినుంచో ఉత్తరాంధ్ర వెనుకబడిందని, విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని చెబుతున్నారు.

కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటుకు అదే ప్రాంతానికి చెందిన ధర్మాన కూడా ఒక కారణమే..గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పలుమార్లు పనిచేశారు. మరి అప్పుడు ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసుకోలేదు. ఇక ఇప్పుడు మంత్రిగా ఉన్న అదే పరిస్తితి. పైకి మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి కాలేదు అని రాజధాని అంటూ ప్రజల్లో సెంటిమెంట్ లేపుతున్నారు. రాజధాని అంశంలో ధర్మాన చేసే వ్యాఖ్యలు చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. వైసీపీ విధానం మూడు రాజధానులు..కానీ అందులో వాస్తవాన్ని ధర్మాన బాగానే చెబుతున్నారు.

పరిపాలన రాజధాని ఏదైతే అదే అసలు రాజధాని అని, విశాఖ అసలు రాజధాని అని చెబుతున్నారు..అసెంబ్లీ కోసం ఏటా మూడుసార్లు అమరావతికి, హైకోర్టు కోసం కర్నూలు వెళ్తారని, అసలు కోర్టుకు వెళ్ళేవారు 0.001 శాతం కూడా ఉండరని చెప్పుకొచ్చారు. అంటే మూడు రాజధానుల పేరుతో వైసీపీ మూడు ప్రాంతాలని మోసం చేస్తుందనే కోణం చెప్పారు.

విశాఖ రాజధాని అంటే..ఇటు కోస్తాకు గాని, అటు రాయలసీమకు గాని రాజధాని దూరమయ్యిందనే సంకేతాలు వెళుతున్నాయి. పైగా తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలని ప్రజలు అర్ధం చేసుకోలేదు..అందుకే వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు టైమ్ లోనే రోడ్లకు కన్నాలు పడ్డాయని, ఇప్పుడు అవి పెద్దవి అయ్యాయని అన్నారు. అంటే అప్పుడు గుంతలు పడితే ఇప్పుడు ప్రభుత్వం పెద్దవి అయ్యేవరకు చూస్తూ కూర్చుందని ధర్మాన చెప్పనే చెప్పారు. మొత్తానికి వైసీపీకి ఇంకా డ్యామేజ్ పెంచడానికి ఒక్క ధర్మాన సరిపోతారని చెప్పొచ్చు.