టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సరళి కూడా పక్కకు పోయింది. అంతకు ముందు అధికార టీఆర్ఎస్ ఎత్తులు.. బీజేపీ పైఎత్తులు.. కాంగ్రెస్ సెంటిమెంట్ రాజకీయాలతో హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. మీడియా ఫోకస్ మొత్తం ఇక్కడే కేంద్రీక్రుతమైంది. కానీ ఒక పెద్ద కుదుపుతో పరిస్థితి అంతా తారుమారైంది.
బీజేపీ పెద్దలు కొందరు మధ్యవర్తుల ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలోగా ఈ ప్రక్రియ ముగించాలని భావించారట. దీని ద్వారా తమ పార్టీ గెలుపును సులభం చేసుకోవాలని యోచించారట. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో ఫుటేజీలు బయటపడడంతో రాష్ట్ర బీజేపీ నేతలు తొలుత ఆత్మరక్షణలో పడ్డారు. బండి సంజయ్ తోపాటు విలేఖరుల సమావేశంలో పాల్గొన్న వివేక్, రాకేశ్ రెడ్డి తదితరుల మొహాల్లో చుక్క నెత్తురు కనిపించలేదు.
తర్వాత తేరుకున్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. దీన్ని అందిపుచ్చుకున్న బండి సంజయ్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఇదంతా గులాబీ పార్టీ డ్రామాగా తేల్చేశారు. అంతటితో ఆగకుండా ఈ ఎపిసోడ్ ను యాదాద్రికి షిఫ్ట్ చేశారు. లక్ష్మీనరసింహుని సన్నిధిలో ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. ఈ విషయంలో గులాబీ నేతలు మౌనంగానే ఉన్నా బండి మాత్రం సవాలుకు కట్టుబడ్డారు. తడి బట్టలతో స్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. దీంతో బండి హిందూ సెంటిమెంటును రాజేసినట్లైంది.
అయితే.. ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండానే కేంద్ర పెద్దలు చక్కబెట్టాలని భావించారని తెలుస్తోంది. ఆడియో, వీడియోలు బయటపడినా కూడా తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభావం మునుగోడుపై ఉండకూడదనే ఉద్దేశంతోనే బండి సెంటిమెంటు రాజకీయాలకు తెరలేపారని.. అయినా తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉందని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి బండి సంజయ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి.