రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలోకి మునిగిపోయింది. ఆయనకు సినీ ఇండస్ట్రీ తోనే కాదు రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇలా పలువురు రాజకీయ నాయకులు కూడా కృష్ణంరాజు మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు.
కృష్ణంరాజు మృతి పై ఏఐజి ఆసుపత్రి బృందం ఈ విధంగా స్పందించడం జరిగింది. డయాబెటిస్ కరోనరీ హార్ట్ డిసీస్ తో కృష్ణంరాజు ఇబ్బంది పడినట్టు వైద్య బృందం స్పష్టం చేసింది. అలాగే కృష్ణంరాజు గుండె కొట్టుకొనే వేగంలో కూడా చాలా కాలంలో పలుమార్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నట్లుగా వైద్యులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక రక్త ప్రసరణ సమస్యతో కూడా గత ఏడాది నుంచి తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లుగా తెలియజేశారు వైద్యులు. ఇక దీర్ఘకాలిక కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు బాధపడుతున్న కృష్ణంరాజు.. ఆ సమయం లో కరోనా సోకడంతో గత నెల 5వ తేదీ ఆసుపత్రిలో చేరారు.
ఇక దీని కారణంగా ఊపిరితిత్తులలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా చేరడంతో తీవ్రమైన నిమోనియా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారట. ఇక ఇది కిడ్నీ పని తీరుపై పూర్తిగా దెబ్బతినేలా చేయడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించినట్లుగా ఏఐజి ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.. అయితే ఉదయం ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు . ఏది ఏమైనా కృష్ణంరాజు లేని లోటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.