#NTR 30 అదిరిపోయే అప్‌డేట్‌… తార‌క్ మ‌రింత కొత్త‌గా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్‌. అప్పుడెప్పుడో 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ సినిమా రాలేదు. మూడేళ్ల పాటు ఊరించిన ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఎన్టీఆర్‌కు డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది.

ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవ‌ల్లో బాగా పెరిగింది. ఇప్పుడు వ‌రుస పెట్టి ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్టుల‌ను ఓకే చేసుకుంటూ పోతున్నాడు. తన కెరీర్ లో 30వ సినిమా… అలాగే దర్శకుడు కొరటాల శివతో రెండో సినిమా చేయనున్నాడు. వాస్త‌వానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది.. అయితే క‌రోనా దెబ్బ‌తో ఈ సినిమా ఎట్ట‌కేల‌కు వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

గ‌తంలో కొర‌టాల – తార‌క్ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ రెండో సినిమాతో వీరి కాంబినేష‌న్ మ‌రోసారి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌నే అంటున్నారు. ఈ సినిమా కోసం తారక్ తన లుక్ ని మార్చనున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం గ‌తంలోనే ఓ లుక్‌లోకి వెళ్లినా అప్పుడు క‌రోనా దెబ్బ‌తో షూటింగ్ లేట్ కావ‌డంతో ఇప్పుడు మ‌రోసారి ఈ సినిమా కోసం కొత్త లుక్‌లోకి వెళ్లిపోతున్నాడు. ఈ లుక్‌లో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న పేర్లు వినిపిస్తున్నాయి.