జ‌గ‌న్ కేబినెట్లో ఈ 4 గురికి మంత్రుల‌కు మ‌ళ్లీ ఛాన్స్‌.. మిగిలినోళ్లు అవుట్ …!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది కానుకగా తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం జగన్ క్యాబినెట్ ను ఉగాదికి మారుస్తానని మంత్రులతో చెప్పిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన వైఎస్సార్ సీఎల్పీ మీటింగ్ జర‌గ‌నుంది. ఈ మీటింగ్ లో క్యాబినెట్ లో ఎవరు ఉంటారు ? ఎవరు బయటకు వస్తారు ? ఎవరు కొత్త‌గా వ‌స్తారు ? అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక‌ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో క్యాబినెట్ లో ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది మంత్రులను మారుస్తానని… వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ముందే ప్రకటించారు. అయితే గత ఏడాది దసరాకు మంత్రివర్గాన్ని మార్చాల్సి ఉంది. అయితే ఆ సమయంలో మంత్రులు క‌రోనా వ‌ల్ల‌ దాదాపు ఏడాదిన్నర కాలంగా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే తమకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన క్రమంలో మంత్రివర్గ ప్ర‌క్షాళ‌న జగన్ వాయిదా వేశారు.

ఈ ఉగాదికి కచ్చితంగా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రి వ‌ర్గంలో బొత్స సత్యనారాయణ – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పేర్ని నాని – కొడాలి నాని కి జగన్ మరోసారి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని టాక్ ?

చివరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సైతం పక్కనపెట్టి ఆయన స్థానంలో మరో రెడ్డి వర్గానికి చెందిన నేతకు ఆర్థిక శాఖ మంత్రి పదవి కట్టబెట్టాలని జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌న్న‌ ప్రచారం జరుగుతోంది. ఆశావాహులు స‌జ్జ‌ల‌ను క‌లిసి తమ‌కు మంత్రి పదవి ఇప్పించాలని వేడుకుంటున్నారు మరి వీరిలో ఎవరి అశ‌లు నెరవేరుతాయో ? చూడాలి.