ఇంట్లో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌… వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఎంత క‌ష్టంరా బాబు…!

ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకుచిక్కులు మామూలుగా లేవా? వారు బ‌య‌ట‌కు వ‌స్తే.. ఒక విధ‌మైన ప‌రి స్థితి.. బ‌య‌ట‌కు రాక‌పోతే.. మ‌రో విధ‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారా? అధిష్టానం త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని తెగ‌బాధ‌ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేల‌కు ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు ఉన్నాయి. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను వివ‌రించాల‌ని.. ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాల‌పై ఏం చేయాల‌నే విష‌యం ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగా మారింది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బ‌య‌ట‌కు వ‌స్తున్న ఎమ్మెల్యేలు ప‌డుతున్న ఇబ్బందులేన‌ని అంటున్నారు ప‌రి శీల‌కులు. “పార్టీకి అంద‌రూ విధేయులే. ముఖ్యంగా మా నాయ‌కుడు జ‌గ‌న్ సీఎం కావాల‌ని మేం అంద‌రం త‌పించాం. అంతేకాదు.. ఆయన మ‌రో 30 ఏళ్ల పాటు.. అధికారంలో ఉండాల‌ని కూడా కోరుకుంటున్నాం. కానీ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటేనే.. ఇబ్బందులు వ‌స్తున్నాయి` అని తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కాపు నాయ‌కుడు.. ఎమ్మెల్యే ఒక‌రునిర్మొహ‌మాటంగా మ‌న‌సులో మాట బ‌య‌ట‌కు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు కూడా ఇదే మాట వినిపిస్తున్నారు. అయితే.. ఎందుకు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని మాత్రం చెప్ప‌డం లేదు.

దీనిపై న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. బ‌య‌ట‌కు వ‌స్తున్న ఎమ్మెల్యేల‌ను చూస్తున్నారు క‌దా! అని విశాఖ‌కు చెందిన మ‌రో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. బ‌య‌ట‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌తో క‌లుస్తున్న ఎమ్మెల్యేల‌ను గ‌మనిస్తే.. ప‌లు అంశాల‌పై వారు చిక్కుల్లో ప‌డుతున్నారు. ఒక‌టి ఓటీఎస్‌(వ‌న్ టైం సెటిల్మెంట్‌), రెండు చెత్త‌ప‌న్ను, మూడు జిల్లాల విభ‌జ‌న‌. ఈ మూడు కార‌ణాలు.. వారికి ఇబ్బందిగా మారాయి. తాజాగా మీతో మీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మం కింద బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు.. ఓటీఎస్‌పై నిల‌దీశారు. దీంతో ఆమె స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డ్డారు.

ఇక‌, చెత్త ప‌న్నును కూడా ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. అదేస‌మ‌యంలో జిల్లాల విభ‌జ‌న‌, డివిజ‌న్ల ర‌ద్దు, కొత్త జిల్లా కేంద్రాల‌పై ఆగ్ర‌హం వంటివి కూడా ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగానే మారాయ‌. దీంతో వారు బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. ఒక‌వేళ ధైర్యం చేసి వ‌చ్చినా.. ఈ మూడు అంశాల‌కు ఏం స‌మాధానం చెప్పాల‌నేది వారి సందేహం. పోనీ.. అలాగ‌ని ఇంటికే ప‌రిమిత‌మైనా.. అధిష్టానం నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎక్క‌డ ఉన్నారు? ప్ర‌జ‌ల్లోకివెళ్తున్నారా? లేదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీంతో అటు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌.. ఇటు ఇంట్లోకూడా ఉండ‌లేక పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.