ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలా బయటకు పంపాలా అని టీఆర్ఎస్ కీలక నేతలే చూస్తున్నారా ? అందుకు ఒక్కో అస్త్రం ఆయనపై క్రమక్రమంగా ఎక్కు పెడుతున్నారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. వైసీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన పొంగులేటి ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు వరకు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే ఆ ఎన్నికల్లో జిల్లాలో ఖమ్మం అసెంబ్లీ సీటు మినహా ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవలేదు. పొంగులేటి వెన్నుపోట్లే కారణమని మాజీ మంత్రి తుమ్మలతో పాటు జిల్లాలో చాలా మంది కేసీఆర్కు కంప్లైంట్ చేశారు.
అప్పటి నుంచి పొంగులేటిని పక్కన పెట్టేస్తూ వస్తున్నారు. చివరకు సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా ఖమ్మం టిక్కెట్ తెచ్చుకోలేకపోయారు. ఇక జిల్లాలో మంత్రి పువ్వాడ, మాజీ మంత్రి తుమ్మల ఒక్కటి అయిపోయారు. ఇక పొంగులేటి అన్ని నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతూ శత్రువులను పెంచుకుంటోన్న పరిస్థితి. తాజాగా అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగులో శుక్రవారం రాత్రి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరోసారి ఘర్షణ నడిచింది.
పొంగులేటి వర్సెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలను ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులను పిలవకపోవడంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమం క్యాన్సిల్ చేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. అయితే పొంగులేటి మాత్రం పిడమర్తి రవితో ఈ విగ్రహం ఆవిష్కరింపచేశారు. దీంతో రేగా, పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
దీంతో ఎమ్మెల్యే రేగా మండిపడుతూ అసలు పొంగులేటి టీఆర్ఎస్లో లేరని మండిపడ్డారు. పొంగులేటి మాత్రం ఎమ్మెల్యేకు డౌట్ ఉంటే కేసీఆర్నో, కేటీఆర్నో అడగాలని.. తాను పార్టీలోనే ఉన్నానని.. రేపు ఇక్కడ రేగాకు సీటు ఇచ్చినా.. మరెవ్వరికి సీటు ఇచ్చినా పార్టీకి పనిచేస్టామన్నారు. రేగా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చారు.
ఇక్కడ గతంలో వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి వర్గం.. ఆయనకు సపోర్ట్ చేస్తుండడంతోనే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఏదేమైనా జిల్లాలో పొంగులేటి వ్యతిరేక వర్గం బలంగా పెరుగుతోంది. ఇది రేపటి వేళ ఆయన్ను పార్టీ నుంచి పంపేలా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అంటున్నారు.