రాష్ట్రంలో మంత్రి పదవుల పందేరం విషయంలో ఓ జంపింగ్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? తనకు తానుగానే ప్రచారం చేసుకుంటున్నారా? తనకు మంత్రి పదవి ఇవ్వక తప్పదని ఆయన తెగ సంబరపడిపోతున్నారా? తనను మించిన సీనియర్ లేరని.. కమ్మ వర్గానికి ఇస్తే.. తనకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆయన చెప్పుకొంటున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి ప్రకాశం జిల్లాలోని రాజకీయ వర్గాలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన నాయకులు కొందరు పార్టీ మారకుండానే వైసీపీకి మద్దతిచ్చారు.
వీరిలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఒకరు. ఈయన 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. సుదీర్ఘ కాలం టీడీపీలోనే ఉన్నారు. అయినప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పార్టీలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. మంత్రి పదవి దక్కించుకోలేక పోయారనే వాదన ఉంది. దీనికి కారణం ఆయన దూకుడేనని పార్టీలో చర్చకూడా ఉంది. అసలు గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్టే వస్తుందో ? రాదో ? అన్న ప్రచారం బాగా జరిగింది. అయితే చివర్లో చీరాలలో అప్పుడు టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ మారిపోవడంతో చంద్రబాబు చివర్లో ఆయనకు చీరాల సీటు ఇవ్వడం.. అక్కడ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిపోయినా ఆయన గెలవడం జరిగిపోయాయి.
అయితే.. ఇప్పుడు వైసీపీ సానుభూతి పరుడిగా ఉన్న నేపథ్యంలో పార్టీ మారకపోయినా తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు.. కమ్మ వర్గాన్ని వైసీపీ సానుకూలం చేసుకోవాలంటే.. తనకు మంత్రి ఇవ్వక తప్పదనే ప్రచారం చేసుకుంటున్నారు.
తనను మించిన సీనియర్ జిల్లాలోనే లేరని.. జగన్ కు తనకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. వైసీపీ లో ఇప్పటికే మంత్రి పదవిని ఆశిస్తున్నావారు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు.
ఈ క్రమంలో ఈయన వారి ఆలోచనలను పక్కదారి పట్టించే చర్యలు చేస్తున్నారని.. ముఖ్యంగా తన ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ నేతలను మరింతగా ఆత్మర క్షణలో పడేసేందుకు.. తనకు కనీసం పార్టీలో ఎంతో కొంత గుర్తింపు దక్కుతుందనే కరణం సొంత ప్రచారం ప్రారంభించారట. జగన్ కోసం .. ఎన్నో త్యాగాలు చేసిన వారిని వదిలేసి.. ఇలాంటి జంపింగులకు జగన్ ఎందుకు మంత్రి ఇస్తారని.. వైసీపీలో చర్చ సాగుతోంది. కొడాలి నానిని తప్పించి కమ్మ వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలంటే జగన్ స్వయంగా హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్ ఉన్నారు. అసలు కరణంకు ఎమ్మెల్యే సీటుపైనే టెన్షన్ పట్టుకోవడంతో ఈ కొత్త ప్రచారం ప్రారంభించారని.. ఆయనకు మంత్రి పదవి ప్రచారంలో నిజం లేదని వైసీపీలో వినిపిస్తోన్న టాక్ ?