అడవి తల్లి పాట పాడిన ఫోక్ సింగర్ దుర్గవ్వకు.. ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా?

ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో జానపద పాటలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఆ తర్వాత కాలంలో పాశ్చాత్య సంగీతం సినిమాల్లో వచ్చేసింది. దీంతో జానపదాలు ఎక్కడా కనిపించకుండా పోయాయి. కానీ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం ఆ మట్టి వాసన ఉండే పాటల వైపే అడుగులు వేస్తోంది. అర్థంకాని మ్యూజిక్ కాదు.. మళ్లీ ఆ జానపదాలే టాలీవుడ్లో రాజ్యమేలుతున్నాయి. ఏదైనా సినిమాలో జానపద పాట ఉంది అంటే చాలు ఇక అది సూపర్ హిట్ అవుతుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో టాప్ సింగర్స్ కాదు పల్లె గొంతుకలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రతి సినిమాలో కూడా మట్టిలో మాణిక్యం లాంటి ఎక్కడో మారుమూల నుండి ఒక సింగర్ తెర మీదకు వచ్చి పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఇక ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాలో ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్య సాహితీ చాగంటి తో కలిసి తన గొంతు కలిపిన కుమ్మరి దుర్గవ్వలు ప్రస్తుతం ఒక్కసారిగా సెలబ్రిటీలు గా మారిపోయారు. కూలి పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడుకునే దుర్గవ్వ ఇక ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో అడవి తల్లి పాటలో అచ్చమైన స్వచ్ఛమైన పల్లె గానాన్ని వినిపించి తెలుగు ప్రేక్షకుల మనసును పులకరింప చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఎలా వచ్చింది ఎంత పారితోషికం తీసుకుంది అన్న విషయాలు చెప్పుకొచ్చింది. సిరిసిల్ల చిన్నది, ఉంగరము పాటలు పాడాను.. ఆ పాటలు మంచి ఆదరణ పొందాయి.. ఇక ఆ పాటలు విన్న తర్వాత భీమ్లా నాయక్ లో పాట పాడాలి అంటూ ఆఫర్ వచ్చింది. ఇక ఈ ఆఫర్ రావడంతో ఎంతగానో సంతోష పడి పోయాను. ఐదారు నిమిషాలలోనే పాటలు పాడేసాను అంటూ చెప్పుకొచ్చింది దుర్గవ్వ. ఈ సినిమాలో పాట పాడినందుకు గాను 10 వేలు ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు నా కూతురుకు ఇచ్చి పంపించారు అంటూ చెప్పుకొచ్చింది మట్టిలో మాణిక్యం కుమ్మరి దుర్గవ్వ..