ఆ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా నటుడు విశ్వనాధ్..!

సినీ ఇండస్ట్రీలో ఉండే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడనే విషయం తెలిసిందే.అయితే తాజాగా దర్శకుల సంఘానికి కూడా ఒక కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. తెలుగు చిత్రం సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన యనమదల కాశీ విశ్వనాథ్ తాజాగా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఇక జనరల్ సెక్రెటరీగా మరో దర్శకుడు అయిన వీఎన్ ఆదిత్య, ఉపాధ్యక్షులుగా జీఎస్ రావు, మేర్లపాక గాంధీ ఎంపిక కావడం గమనార్హం..

కోశాధికారిగా భాస్కర్ రెడ్డిని దర్శకులు ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నిక అయిన సభ్యులంతా 2021 నవంబర్ 18వ తేదీన అంటే గురువారం రోజున పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాశీ విశ్వనాథ్ మొదటిసారిగా నువ్వు లేక నేను లేను అనే సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తరువాత తొలిచూపులోనే అనే సినిమాకు దర్శకత్వం వహించి.. నచ్చావులే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.వందకు పైగా సినిమాల్లో నటించిన కాశీవిశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంకు దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నంలో జన్మించాడు.

జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన వి.యన్.ఆదిత్య ఉదయ్ కిరణ్ తో కలిసి మనసంతా నువ్వే సినిమాను తెరకెక్కించాడు. ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు.