వైఎస్ఆర్ వాహనమిత్రలో కొత్త నిబంధనలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లబ్ధిదారులతో పాటు, కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం పలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

గతేడాది లబ్ధిదారుల్లో అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఆ లిస్ట్ లోపేరు ఉంటే వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

గత 6 నెలల (ఏప్రిల్‌ వరకు) సగటు ఇంటి కరెంట్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటితే వారు ఈ పథకాన్ని అర్హులు కాలేరు.

కుటుంబంలో ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ జాబ్, పింఛను పొందే వారు కూడా ఉండకూడదు. అలాంటి వారు ఉంటే అర్హులు కారు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు.

వేరే పథకం కింద లబ్ది పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు

3 ఎకరాలకు పైగా మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకం పొందడానికి అర్హులు కారు. మున్సిపాలిటీ ప్రాంతాల పరిధిలో దరఖాస్తుదారుల కుటుంబానికి 1000 చదరపు అడుగులకు మించి ఇల్లు కానీ.. వాణిజ్య సంబంధ నిర్మాణం కానీ ఉండకూడదు.

ప్రయాణికుల ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్‌ నడిపే వాహనదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సరకు రవాణా వాహనదారులకు ఈ పథకం వర్తించదు.

కొత్తవాళ్లు గ్రామ, వార్డు వాలంటీరు ద్వారా జూన్ 7వ తేదీ లోపు అప్లై చేయాలి. వివిధ దశల్లో పరిశీలన అనంతరం జూన్ 15వ తేదీన సీఎం జగన్ చేతుల మీదగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, 56 బీసీ కార్పొరేషన్లు, కాపు, మైనార్టీ, బ్రాహ్మణ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి ఈ నిధులను వెచ్చిస్తారు.

గతేడాది 2.73 లక్షల మందికి వాహనమిత్ర పథకం కింద ఆర్ధిక సాయం అందింది. ఈసారి కొత్త నిబంధనల వల్ల గతేడాది లబ్ధిదారుల్లో వేల మంది అనర్హులుగా తేలనున్నట్లు తెలిసింది. ఆయా నిబంధనలు వర్తించని లబ్ధిదారులు, సంబంధిత పత్రాలతో మళ్లీ అప్ప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపు వాహనాన్ని అమ్మితే అనర్హులు అవుతారని, అయితే వారు కొత్త వాహనం కొంటే మళ్లీ అప్ప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.