2డీజీ డ్రగ్ ధర ఖరారు..!

కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్‌ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

2-డీజీ ఔషధాన్ని డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తో కలిసి డెవలప్ చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కరోనా రోగులు త్వరగా కోలుకునేలా ఈ 2-డీజీ డ్రగ్ పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. ఈ ఔషధం పౌడర్ రూపంలో ఉంటుంది. దీనిని నీటిలో కలుపుకొని తాగాలి. ఈ ఔషధానికి డీజీసీఐ ఇటీవల అత్యవసర వినియోగ అనుమతినిచ్చింది. మే 17న తొలి విడత కింద 10 వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10 వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. 2-డీజీ ఔషధాన్ని వాడిన రోగులు త్వరగా కోలుకోవడమే కాకుండా, వారికి ఆక్సజన్ అందించే అవసరం తగ్గినట్టు వెల్లడైంది. పౌడర్ రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలిపి తీసుకోవాలి.