టీటీడీ చైర్మన్ పదవి ముగుస్తున్న కొద్దీ.. తిరుమల శ్రీనివాసుడి కటాక్షం ఎవరిపైన ఉంటుందనే చర్చ టీడీపీలో జోరందుకుంది. ముఖ్యంగా ఈ పదవిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే! ఈమేరకు ఆయన ఇప్పటికే మంతనాలు కూడా జరుపుతున్నారు. కమ్మ సామాజిక వర్గం కూడా ఆయనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మంత్రి పదవి ఆశించి భంగపడిన గాలి ముద్దు కృష్ణమనాయుడికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ నెల 27వ తేదీ నాటికి టీటీడీ పాలక మండలి పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ తరువాత కొత్త పాలకమండలి ఛైర్మన్ అవసరం ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ సాంబశివరావును ఆ పదవిలో కొనసాగించకపోవచ్చన్న వార్తలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ లో ఉన్న నాటి నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు రాయపాటి సాంబశివరావు. శ్రీనివాసుడి సేవ చేసుకోవడమే తన ఆశయమని.. ఎన్నో సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టీటీడీ చైర్మన్ పదవి హామీ మేరకే ఆయన టీడీపీలో చేరారనే గుసగుసలు వినిపించాయి. ఇక పదవి ఖాయమనుకున్న తరుణంలో గాలి ముద్దు కృష్ణమనాయుడి పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి.. తీవ్రంగా నిరాశ చెందిన సీనియర్లలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా ఉన్నారు. తనకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని తాను పవన్ పార్టీలోకి వెలిపోతున్నానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నారు. ఆయనను తక్షణమే సంతృప్తి పరచాలంటే మాత్రం టీడీపీ పాలక మండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టాలని సమాలోచనలు చేశారట. ఆ పదవిని ముద్దుకృష్ణమనాయుడుకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని ముందుగానే చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో రాయపాటి పేరు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన ముద్దు కృష్ణమనాయుడికి చైర్మన్ పదవి ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని గాలి ముద్దుకృష్ణమనాయుడికి కూడా చెప్పారట. బాబు ఆఫర్ కి ఆయన కూడా ఓకే చెప్పారని పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి రాయపాటి ఆశలు మరోసారి నెరవేరేలా కనపడడం లేదు.